Lahore: పాక్ భారీ కాయుడు ఆసుపత్రిలో ఘర్షణ కారణంగా మృతి

  • మహిళ మృతితో ఆందోళనకు దిగిన బంధువులు
  • వైద్యులపై దాడి చేసి, ఆసుపత్రిలో బీభత్సం
  • నర్సు వచ్చి చూసేసరికి కొనఊపిరితో ఉన్న హసన్
  • వైద్యులు వచ్చి చికిత్స అందించినా ఫలితం శూన్యం

330 కిలోల బరువున్న నూరుల్ హసన్ అనే భారీకాయుడు లాహోర్‌‌కు 400 కిలోమీటర్ల దూరంలోని సాదిక్‌బాద్‌‌లో నివాసముంటున్నాడు. భారీ కాయంతో ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో అతని అభ్యర్థన మేరకు పాక్ సైనికాధిపతి బజ్వా ఆసుప్రతికి తరలించే ఏర్పాటు చేశారు. దీంతో చికిత్స నిమిత్తం పాక్ సైన్యం ఆయన ఇంటి గోడలను బద్దలు కొట్టి మరీ బయటకు తీసుకొచ్చింది. అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో లాహోర్‌లోని ఆసుపత్రికి ఆర్మీ తరలించింది. అయితే నేడు హసన్ ఆసుపత్రిలో అతడు కన్నుమూశాడు. దీనికి కారణం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘర్షణ అని తెలుస్తోంది.

ఇటీవల హసన్‌కు శస్త్ర చికిత్సను నిర్వహించిన అనంతరం అతనిని ఐసీయూలోకి మార్చారు. దీంతో అతడికి నిరంతర పర్యవేక్షణ అవసరమైంది. అయితే అదే ఆసుపత్రిలో నేడు ఓ మహిళ రోగి మృతి చెందడంతో ఆమె తరుపు బంధువులు ఆసుపత్రి యాజమాన్యంపై ఘర్షణకు దిగడమే కాకుండా వైద్యులపై దాడి చేసి, ఆసుపత్రిని ధ్వంసం చేసి, వెంటిలేటర్లను ఆఫ్ చేసి బీభత్సం సృష్టించారు.

దీంతో సిబ్బంది ఐసీయూలో విధులకు కొంత సమయం పాటు హాజరు కాలేకపోయారు. అదే సమయంలో హసన్ అస్వస్థతకు గురయ్యాడు. ఆ తరువాత నర్స్ వచ్చి చూసేసరికి కొన ఊపిరితో కనిపించాడు. వైద్యులు వచ్చి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసన్ మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

More Telugu News