Hyderabad: వ్యాపారి రాంప్రసాద్ ను హత్య చేసింది నేనే.. కోగంటి సత్యంకు సంబంధం లేదు: నిందితుడు శ్యామ్

  • రాంప్రసాద్ బావమరిది చెబితేనే ఈ హత్య చేశాను
  • పదిహేను రోజులు రెక్కీ నిర్వహించా 
  • ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు పారిపోయా

హైదరాబాద్ లోని పంజాగుట్టలో ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు తెర దించుతూ రాంప్రసాద్ ను హత్య చేసింది తానే అంటూ శ్యామ్ అనే వ్యక్తి ‘టీవీ 9’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తన శిష్యులు చోటు, రమేశ్ తో కలిసి ఈ హత్య చేశానని పేర్కొన్నాడు. పదిహేను రోజులు రెక్కీ నిర్వహించి, ఈ హత్య చేశామని, ఆ తర్వాత ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు పారిపోయానని చెప్పాడు. రాంప్రసాద్ తనకు రూ.15 లక్షలు నష్టం చేశాడని చెప్పాడు. ‘రాం ప్రసాద్ ను హత్య చేస్తే నా డబ్బులు నాకు వస్తాయని రాంప్రసాద్ బావ ఊర శ్రీనివాస్ నాకు చెప్పాడు’ అని, అందుకే, ఈ హత్య చేశానని అన్నాడు. రాంప్రసాద్ హత్యకు ఉపయోగించిన మూడు కత్తులను తన వాటర్ ప్లాంట్ లోనే తయారు చేయించానని అన్నాడు. ఈ హత్యతో కోగంటి సత్యంకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చెప్పాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లొంగిపోతానని అన్నాడు.

More Telugu News