mumbai: ఉదయం నుంచి ముంబైలో కుండపోత...జలమయమైన రోడ్లు

  • కాలువల్లా దర్శనమిస్తున్న రహదారులు
  • రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • విమానాల దారిమళ్లింపు

ముంబై మహానగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. ఉదయం నుంచి కురుస్తున్న కుండపోతతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కాలువలు, చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు తెరిపి తర్వాత మళ్లీ జలప్రళయం నగరాన్ని చుట్టేసింది.

ఆర్థిక రాజధాని, అందులోనూ వారాంతపు సెలవు తర్వాత వచ్చిన రోజు కావడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం నెలకొంది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కారుమబ్బులు కమ్మేయడంతో ఉదయం పది గంటల వరకు నగరం చీకటి గుప్పెటలోనే ఉంది.

దీంతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలకు తాత్కాలిక బ్రేక్‌ ఏర్పడింది. ముందు జాగ్రత్తగా కొన్ని విమానాలను ఎయిర్‌ పోర్టు అధికారులు దారి మళ్లించారు. ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటలపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

More Telugu News