Hindusthan Shipyard: రూ. 10 వేల కోట్లతో భారీ యుద్ధనౌకల నిర్మాణం.. హెచ్ఎస్ఎల్ కి ఆర్డర్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

  • హెచ్ఎస్ఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
  • ఒక్కొక్కటి 45 వేల టన్నుల బరువుండే భారీ యుద్ధనౌకల నిర్మాణం
  • తొలి యుద్ధనౌకను నాలుగేళ్లలోపే అందించేలా షరతు

విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ (హెచ్ఎస్ఎల్) చరిత్రలోనే అతి పెద్ద డీల్ కుదిరింది. ఏకంగా రూ. 10 వేల కోట్లతో ఐదు భారీ యుద్ధనౌకలను నిర్మించే ఆర్డర్ ను హెచ్ఎస్ఎల్ కి కేంద్ర రక్షణ శాఖ కేటాయించింది. హెచ్ఎస్ఎల్ కి 78 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతిభావంతమైన మానవవనరులు, విస్తృతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కానీ, సరైన ఆర్డర్లు రాక, ఇంతకాలం విలవిల్లాడింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్ తో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

ఈ ఆర్డర్ కింద ఒక్కొక్కటి 45 వేల టన్నుల బరువుండే ఐదు యుద్ధనౌకలను హెచ్ఎస్ఎల్ నిర్మించబోతోంది. యుద్ధాల్లో పాల్గొనే నౌకలకు అవసరమైన సామగ్రిని, సిబ్బందికి కావాల్సిన ఆహారాన్ని కూడా అందించే మదర్ షిప్స్ లా కూడా ఇవి వ్యవహరిస్తాయి. ఒప్పందం ప్రకారం మొదటి యుద్ధనౌకను నాలుగేళ్లలోపే నిర్మించాల్సి ఉంటుంది. ఈ యుద్ధనౌకల నిర్మాణం కోసం టర్కీకి సంబంధించిన ఎనడోలు షిప్ యార్డ్ తో హెచ్ఎస్ఎల్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఒప్పందంలో భాగంగా సాంకేతిక సహకారం, డిజైన్లను ఎనడోలు సంస్థ బదిలీ చేయనుంది.

More Telugu News