Krishna: మెదడు పక్క నరం బలహీనం కావడం వల్లే విజయనిర్మల ఆరోగ్యం క్షీణించింది: కృష్ణ

  • ఇటీవలే కన్నుమూసిన విజయనిర్మల
  • హైదరాబాద్ లో సంస్మరణ సభ
  • జీవనసహచరి జ్ఞాపకాలతో కన్నీరు పెట్టుకున్న కృష్ణ

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయనిర్మల కన్నుమూశారు. విజయనిర్మల సంస్మరణ సభను హైదరాబాద్ లో నిర్వహించగా, కృష్ణ, నరేశ్, నమ్రత, జయసుధ, మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, విజయనిర్మల జ్ఞాపకశక్తి అపారం అని, ఎప్పుడో పాతికేళ్లనాటి సంగతులు కూడా ఆమెకు గుర్తుండేవని అన్నారు. అయితే, అల్జీమర్స్ వ్యాధి బారినపడడంతో నిన్నమొన్న జరిగిన విషయాలు కూడా మర్చిపోయేదని, మెదడు పక్కన ఉండే కీలకమైన నరం బలహీనపడడంతో విజయనిర్మల ఆరోగ్యం క్షీణించిందని వెల్లడించారు. చివరికి ఆ అనారోగ్యంతోనే ఆమె ఈ లోకాన్ని విడిచిందని వివరించారు. ఈ సందర్భంగా కృష్ణ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న అందరినీ కలచివేసింది.

More Telugu News