India: టీమిండియాపై వస్తున్న విమర్శలకు ఎవరూ ఊహించిన విధంగా బదులిచ్చిన పాకిస్థాన్ కెప్టెన్

  • ఇంగ్లాండ్ పై భారత్ కావాలని ఓడిపోయిందనుకోను
  • అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు
  • భారత్ పై పాక్ మాజీల మండిపాటు

పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసినా సెమీస్ చేరడంలో మాత్రం దురదృష్టానికి బలైంది. నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ జట్టు పాక్ ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో, టోర్నీ లీగ్ దశ ముగియడంతో పాక్ జట్టు స్వదేశం చేరుకుంది. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కరాచీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ, ఇంగ్లాండ్ పై టీమిండియా కావాలనే ఓడిపోయిందన్న ఆరోపణలు సరికాదని అన్నాడు.

పాకిస్థాన్ సెమీస్ చేరకుండా భారత్ ఈ విధంగా కుట్ర చేసిందన్న వాదనలు సమంజసం కాదని, తమను అడ్డుకోవడానికి కోహ్లీ సేన కావాలనే ఓటమిపాలైందని తాను అనుకోవడంలేదని స్పష్టం చేశాడు. భారత్ కారణంగా తమ సెమీస్ అవకాశాలు దెబ్బతిన్నాయని తాను భావించడంలేదని తెలిపాడు.

ఆతిథ్య ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయన్న నేపథ్యంలో, టీమిండియా ఓటమిపాలైంది. దాంతో, కోహ్లీ సేన కావాలనే ఓడిందని, కొందరు చాంపియన్లు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదని పాక్ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. పాక్ ను సెమీస్ రేసు నుంచి తప్పించడానికి టీమిండియా కుట్రపూరితంగా ఓడిందంటూ ఇష్టంవచ్చినట్టు వకార్ యూనిస్ తదితరులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారందరి అభిప్రాయాలకు భిన్నంగా పాకిస్థాన్ కెప్టెన్ మాత్రం నిజమైన క్రీడాస్ఫూర్తితో వ్యాఖ్యలు చేసి శభాష్ అనిపించుకున్నాడు.

More Telugu News