Narendra Modi: మోదీకి సెలవు ఇవ్వాలనుకున్న నేతలంతా ఇప్పుడు విదేశాల్లో సెలవుపై తిరుగుతున్నారు: ప్రకాశ్ జవదేకర్

  • తిరుపతి విచ్చేసిన కేంద్రమంత్రి
  • సభ్యత్వ నమోదు కార్యక్రమం షురూ
  • మోదీ ప్రత్యర్థులపై పరోక్ష వ్యాఖ్యలు

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ తిరుపతి విచ్చేశారు. నగరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి పదవి నుంచి మోదీకి సెలవు ఇస్తామని అనేకమంది నేతలు చెప్పారని, అలాంటివాళ్లంతా ఇప్పుడు సెలవుపై విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీని ఓడించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని కొందరు నేతలు, పార్టీలు బీరాలు పలికారని, వాళ్లందరికీ ప్రజలే బుద్ధి చెప్పారని పరోక్షంగా చంద్రబాబు, టీడీపీలను ఉద్దేశించి జవదేకర్ వ్యాఖ్యానించారు.

2014లో టీడీపీ గెలిచిందంటే అందుకు కారణం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లేనని స్పష్టం చేశారు. ఎప్పుడైతే మోదీని చంద్రబాబు వ్యతిరేకించారో, ప్రజలు అప్పటినుంచే చంద్రబాబును వ్యతిరేకించడం మొదలుపెట్టారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత విపక్షాల అసమర్థత వెల్లడైందని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేక ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడండి అని వ్యాఖ్యానించారు. కాగా, తిరుపతి విచ్చేసిన సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.

More Telugu News