Andhra Pradesh: చంద్రబాబుకు ఇల్లు కొనుక్కునే స్తోమత లేదా? ఇంటి స్థలం నేను ఇస్తాను: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సెటైర్లు

  • గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు బయటకు రావాలి
  • లేదంటే సీఆర్డీఏ చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది
  • ఎంతటి వారైనా సరే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఉండవల్లి కరకట్టపై ఉన్న అక్రమనిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసాన్ని తొలగించాలని సీఆర్డీఏ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పందిస్తూ, ఈ గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు వెంటనే బయటకు రావాలని, లేదంటే సీఆర్డీఏ  చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. చంద్రబాబు ఐదేళ్లుగా దోచిన సంపదను ఆ ఇంట్లోనే ఏమన్నా దాచిపెట్టారా? ఈ ఇంటిని చంద్రబాబుకు బలవంతంగా లింగమనేని ఇస్తే, ఆ విషయాన్ని ఆయన చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎంతటి వారైనా సరే, అక్రమనిర్మాణాలు ఉంటే చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఇల్లు కొనుక్కొనే స్తోమత లేకపోతే, ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని తాను ఇస్తానంటూ సెటైర్లు విసిరారు.

More Telugu News