DK Shivakumar: అవును.. రాజీనామా పత్రాలన్నీ చింపేశా: కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్

  • నా పార్టీని, మిత్రులను కాపాడుకునేందుకు ఆ పని చేశా
  • జరుగుతున్న పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నాయి
  • రాజీనామా చేసిన వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా

కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. ఇరు పార్టీలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. మరికొందరు ఇదే బాటలో ఉన్నారనే వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ పరిస్థితి చేయిదాటిపోలేదని... పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామని చెప్పారు. అంతేకాదు, ఎమ్మెల్యేలు ఇచ్చిన రాజీనామా పత్రాలను చింపేశానని తెలిపారు. (రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్ కార్యాలయనికి వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి వాటిని తీసుకుని డీకే శివకుమార్ చింపేశారు).

'అవును. రాజీనామా పత్రాలను చింపేశాను. కావాలనుకుంటే నా మీద ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎంతో రిస్క్ తీసుకున్నా. నా పార్టీని, నా మిత్రులను కాపాడుకునేందుకే ఇదంతా చేశా' అని శివకుమార్ చెప్పారు. రాజీనామా చేసిన వారు ఏవో కథలు చెబుతున్నారని... వారు రాజీనామా చేసేందుకు అవి సరైన కారణాలు కాదని అన్నారు. జరుగుతున్న పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నాయని చెప్పారు. ఇంకా సమయం ఉందని... వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. లేని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News