Nara Lokesh: జగన్ గారూ, మీ సాక్షిలో ఇలాంటి వార్తా?: నారా లోకేశ్

  • బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం
  • సాక్షి పత్రికలో భజన వార్తలు
  • మోదీపైనే మీ విశ్వసనీయత
  • ట్విట్టర్ లో లోకేశ్ వ్యాఖ్యలు

నిన్నటి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగితే, సాక్షి పత్రికలో మాత్రం కేంద్రానికి భజన చేస్తూ, వార్తలు రాసుకున్నారని మాజీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ కు ప్రజలపై విశ్వసనీయత లేదని, ఆయనకున్న విశ్వసనీయత మోదీ గురించేనని విమర్శించారు.  ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు. "వైఎస్ జగన్ గారూ! ఇన్నాళ్ళూ విశ్వనీయత అని మీరు అంటుంటే ప్రజల గురించి అనుకున్నాం. కానీ ఈ రోజు మీ విశ్వసనీయత మోడీ గురించి అని తెలిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగితే, మీ అక్రమ పత్రిక సాక్షిలో కేంద్రానికి భజన చేస్తూ ఇలాంటి రాతలు రాసుకున్న మీ గులాంగిరికి సలాం" అని అన్నారు

ఆపై "మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేదు. ఏది మీ పోరాటం? ఏది మీ మడమ తిప్పని నైజం? కాళ్ళకు సాష్టాంగ పడటం, భజన చేయడమే పోరాటం అనుకుంటున్నారా? ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలచుకున్నారో చెప్పండి. ఇది ప్రజల తరపున మా డిమాండ్" అని, "గతంలో కేంద్రం ఇలాగే ఏపీకి మొండిచెయ్యి చూపిస్తే, నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబుగారు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? కేసుల భయంతో మీరు కేంద్రానికి దాసోహం అనొచ్చు. కానీ అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది?" అని అన్నారు.

More Telugu News