Andhra Pradesh: పశ్చిమగోదావరిలో దారుణం.. విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి, కాపాడబోయిన మహిళకు తీవ్రగాయాలు!

  • పశ్చిమగోదావరి కలరాయనగూడెంలో ఘటన
  • దుస్తులు ఆరేస్తుండగా ఇనుక తీగలో విద్యుత్ ప్రవాహం
  • ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం కలరాయనగూడెంలో ఓ మహిళ దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. సరోజిని అనే మహిళ బట్టలను ఆరేస్తుండగా, తాడులా కట్టిన ఇనుక తీగలో విద్యుత్ ప్రవహించింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సందర్భంగా సరోజిని కేకలు విన్న పొరుగింటి మహిళ ఒకరు ఆమెను కాపాడేందుకు వచ్చారు.

సదరు మహిళ సరోజినిని కాపాడే క్రమంలో చేతితో తాకడంతో ఆమెకూ తీవ్రగాయాలు అయ్యాయి. వీరి అరుపులు విన్న స్థానికులు ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీరిని పరిశీలించిన వైద్యులు సరోజిని అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయనీ, ఆమెకు ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News