Nirmala sitaraman: బడ్జెట్‌లో ఈ రంగాలకు పెద్దపీట... ఊహాగానాలు నిజమయ్యేనా?

  • నిర్మల చిట్టాపద్దుపై భారీ అంచనాలు
  • ప్రారంభమైన విశ్లేషణలు
  • వ్యవసాయ రంగం, చిన్నతరహాల పరిశ్రమలకు ఊతమిచ్చే చర్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఓ మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న దానిపై విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం..

బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యవసాయోత్పాదకతను పెంచేందుకు బడ్జెట్‌లో దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించనున్నారు. అలాగే, వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించనున్నారు. ఆరోగ్య రంగం విషయానికొస్తే.. హెల్త్ చెకప్‌లపై ట్యాక్స్‌లు తగ్గించనున్నారు. అయితే, వైద్య రంగానికి అదనంగా కేటాయింపులు ఉండకపోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన ప్రణాళికకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉంది. అలాగే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దేశంలోని చిన్నతరహా పరిశ్రమలకు మరింత ఊతం అందించే చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. అంటే.. పన్నుల విషయంలో కొన్ని రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనదిగా భావిస్తున్న ఆదాయ చట్టంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పన్ను మినహాయింపుల ద్వారా సగటు జీవికి ఊరటనిచ్చే చర్యలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, ప్రాథమిక పన్ను మినహాయింపు విషయంలో పెంపు ఉండకపోవచ్చు.

More Telugu News