Road Accident: సూర్యాపేటలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతి

  • హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనం
  • ఆకుపాముల వద్ద ట్యాంకర్‌ను ఢీకొట్టిన వైనం
  • బాధితులది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న తుపాను వాహనం ఆకుపాముల వద్ద అదుపుతప్పి యూటర్న్ తీసుకుంటున్న ఆయిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో తుపాను వాహనంలో ఉన్న జుట్లు లక్ష్మమ్మ (95), తెల్ల నాగమ్మ (55) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ సహా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తొలుత కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ తరలించారు. బాధితులు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. 

More Telugu News