Uttar Pradesh: స్నేహ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్న యువతులు!

  • ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘటన
  • ఇద్దరికీ పెళ్లి చేసిన హనుమాన్ ఆలయ పూజారి
  • గ్రామస్తులే పెళ్లి పెద్దలు

చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఆ ఇద్దరి మధ్య స్నేహం పెనవేసుకుపోయింది. అది ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బలపడింది. ఆ విషయం గ్రహించిన వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

కాన్పూరుకు చెందిన ఇద్దరు యువతులు కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచీ స్నేహితులు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇంట్లో వాళ్లకు చెప్పడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇద్దరూ ఇంట్లోంచి వచ్చేసి వారణాసి జిల్లా విర్భన్‌పూర్‌లోని రొహానియా ప్రాంతానికి చేరుకున్నారు.

గ్రామంలోని హనుమంతుడి ఆలయానికి చేరుకుని అక్కడి పూజారికి పరిస్థితి వివరించారు. తమకు పెళ్లి జరిపించాలని కోరారు. తొలుత వారి నిర్ణయం విని ఆశ్చర్యపోయిన పూజారి తర్వాత అంగీకరించాడు. గ్రామ పెద్దలను పిలిపించి మాట్లాడాడు. వారే పెళ్లి పెద్దలుగా నిలిచి ఇద్దరికీ ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై యువతులు ఇద్దరినీ ఆశీర్వదించారు.

More Telugu News