west indies: ఆఫ్ఘనిస్థాన్ పరాజయాలు పరిపూర్ణం.. చివరి మ్యాచ్‌లోనూ తప్పని ఓటమి!

  • విండీస్‌పై గెలిచినంత పనిచేసి ఓడిన ఆప్ఘనిస్థాన్
  • ఇక్రం అలీ అద్భుత ఇన్నింగ్స్
  • రెండు విజయాలతో ప్రపంచకప్ నుంచి విండీస్ నిష్క్రమణ 

ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ పరాజయాలు పరిపూర్ణమయ్యాయి. ఆడిన 9 మ్యాచుల్లోనూ ఓడి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. తలపడిన అన్ని మ్యాచుల్లోనూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి అభిమానుల మనసులు దోచుకుంది. గురువారం లీడ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ గెలిచినంత పనిచేసి ఓడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్లు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేశారు. క్రిస్ గేల్ మరోమారు నిరాశపరచగా ఎవిన్ లూయిస్ 58, షాయ్ హోప్ 77, షిమ్రాన్ హెట్‌మెయిర్ 39, నికోలస్ పూరన్ 58, జాసన్ హోల్డర్ 45 పరుగులు చేశారు.

అనంతరం 312 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ విజయం దిశగా దూసుకెళ్లినట్టు కనిపించింది. అయితే, చివర్లో వరుసపెట్టి వికెట్లు కోల్పోవడంతో విజయానికి 23 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రహ్‌మత్ షా 62, ఇక్రం అలీ ఖిల్ 86, జద్రాన్ 31, అస్ఘర్ అఫ్ఘాన్ 40, సయెద్ షిర్జాద్ 25 పరుగులు చేశారు. షాయ్ హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లూ పూర్తి చేసుకున్న విండీస్‌కు ఇది రెండో విజయం మాత్రమే.

More Telugu News