Andhra Pradesh: చివరకు మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదు కదా చంద్రబాబు గారూ!: విజయసాయిరెడ్డి

  • టీడీపీ నేతలు మరుగుదొడ్ల నిధులను మింగేశారు
  • మంత్రులు టాయిలెట్ల రెనోవేషన్ కోసం రూ.7-9 లక్షలు ఖర్చు పెట్టారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పేదల కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను టీడీపీ నేతలు మింగేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నివాసం, ఆయన మంత్రుల ఇళ్లలో ఒక్కో మరుగుదొడ్డి ఆధునికీకరణ(రెనోవేషన్) కోసం రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షలు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇందుకోసం నకిలీ బిల్లులు సృష్టించారని దుయ్యబట్టారు. చంద్రబాబు చివరకు మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదని ఎద్దేవా చేశారు.

ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పేద కుటుంబాలకు మరుగు దొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను మీ పార్టీ నేతలు మింగేశారు. మీ నివాసం, మంత్రుల ఇళ్లలో ఒక్కో టాయిలెట్ రెనోవేషన్ పనులకు 7 నుంచి 9 లక్షలు ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించారు. చివరకు దొడ్లను కూడా వదిలి పెట్టలేదు కదా చంద్రబాబు గారూ?’ అని ట్వీట్ చేశారు.

More Telugu News