amarnath yatra: అమర్ నాథ్ యాత్రలో జారిపడ్డ రాళ్లు.. భక్తులకు తగలకుండా కవచంలా నిలబడ్డ ఐటీబీపీ జవాన్లు!

  • కశ్మీర్ లోని కాళీమాత మార్గ్ వద్ద ఘటన
  • భద్రత కోసం ఐటీబీపీ జవాన్ల మోహరింపు
  • జవాన్లపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

భారత జవాన్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ విధులను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తుల సందర్భంగా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతూ ఉంటారు. తాజాగా అమర్ నాథ్ యాత్రకు వెళుతున్న భక్తులకు ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) జవాన్లు రక్షణ కల్పిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇందులో కొండపై నుంచి రాళ్లు జారిపడుతుండగా అవి భక్తులకు తగలకుండా ఐటీబీపీ జవాన్లు అడ్డుగోడలా నిలబడి రాళ్లను అడ్డుకున్నారు. అమర్ నాథ్ యాత్రకు కశ్మీర్ లోని కాళీమాత మార్గ్ ద్వారా భక్తులు వెళుతుండగా ఈ రాళ్లు జారిపడ్డాయి. దీంతో అక్కడే రక్షణగా నిలిచిన జవాన్లు వాటిని తమకు ఇచ్చిన ఫైబర్ కవచాలతో అడ్డుకున్నారు. దీంతో భక్తులు సురక్షితంగా ముందుకు కదిలారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఐటీబీపీ జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News