Andhra Pradesh: ఈ పథకాలకు నిధుల కొరత అన్నది రాకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం!

  • ఆర్థికశాఖపై ముగిసిన ముఖ్యమంత్రి భేటీ
  • బడ్జెట్ లో కేటాయింపులపై మంత్రి బుగ్గనతో చర్చ
  • మంత్రి, అధికారులకు సీఎం కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నవరత్నాల పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనీ, అందుకు అనుగుణంగానే నిధుల కేటాయింపు ఉండాలని చెప్పారు. ఈ నెల 12న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఏయే రంగాలకు ఎంతెంత కేటాయింపులు చేయాలో ముఖ్యమంత్రి సూచించారు.

అలాగే పెంచిన పెన్షన్లకు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను ప్రకటించిన రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా రుణాల మాఫీ, ఉద్యోగుల వేతనాల పెంపు, అమ్మఒడి పథకం, గృహనిర్మాణం తదితర పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రాకూడదనీ, ఈ పథకాలకు అధికంగా నిధులు కేటాయించాలని సూచించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి సీఎం జగన్ ఏపీ ఇసుక పాలసీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

More Telugu News