Andhra Pradesh: గుంటూరులో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడిచేసిన వైసీపీ శ్రేణులు!

  • మాచవరం మండలంలోని తురకపాలెంలో ఘటన
  • అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించి చెలరేగిన గొడవ
  • అల్లావుద్దీన్ అనే టీడీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెంలో వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఓ అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించి టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వైసీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్త షేక్ అల్లావుద్దీన్ పై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన కుడిచేతికి తీవ్రగాయం అయింది. దీంతో ఆ గాయంతోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన అల్లావుద్దీన్ ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఘటన అనంతరం పరారయ్యారు. దీంతో కేసు నమోదుచేసిన మాచవరం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News