Vizag: ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించి... వదిలుండలేక ఆత్మహత్య!

  • నిన్న నడిరోడ్డుపై మంటల్లో కావ్య
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు

విశాఖపట్నంలో సంచలనం రేపిన నర్సు కావ్య ఆత్మహత్య కేసును పోలీసులు ఓ కొలిక్కి తెచ్చారు. ఆమె బలవన్మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని అంటున్నారు. పెట్రోల్ పోసుకుని కావ్య ఆత్మహత్య చేసుకోగా, పెళ్లయి, ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించిన ఆమె, విషయం తెలిసిన తరువాత ఆ ప్రేమను వదులుకోలేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడిందని అనుమానిస్తున్నారు. ఆమె పనిచేస్తున్న ఆసుపత్రిలోనే ఆంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న నరేంద్ర అనే యువకుడిని ప్రేమించిన కావ్య, అతనికి అంతకుముందే పెళ్లయిన విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే బుధవారం శివాజీపాలెం రోడ్ లో నడుచుకుంటూ వెళుతున్న కావ్య, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నడిరోడ్డుపై ఓ యువతి ఉన్నట్టుండి మంటల్లో కాలుతుండడాన్ని గమనించిన స్థానికులు, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆపై ఆమెను ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో ఉన్న కావ్య విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె కాల్ డేటాను, చాటింగ్ వివరాలను పరిశీలించిన తరువాత ప్రేమ వ్యవహారం ఈ ఆత్మహత్య వెనుక ఉందని గుర్తించామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News