Aswini: ప్రమాదవశాత్తు రైలు కింద పడి యువతి మృతి

  • ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న అశ్విని
  • స్టాప్ రానుండంతో బోగి డోర్ వద్ద వెయిటింగ్ 
  • ఫోన్ తీసుకోబోయి రైలు కింద పడిపోయిన అశ్వని

గమ్యస్థానం వచ్చిందని, రైలు బోగి డోర్ వద్దకు వచ్చిన ఓ యువతి తన ఫోన్ రైలులోనే కింద పడటంతో అది తీసుకోబోయి ప్రమాదవశాత్తు జారి పట్టాల కింద పడిపోయి మృతి చెందింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం, హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండి బీదలబస్తీలో నివాసముంటున్న రాంచందర్, సునీత దంపతుల చిన్న కుమార్తె అశ్విని(22) బేగంపేటలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తోంది.

నేటి ఉదయం తన విధులకు హాజరయ్యేందుకు సీతాఫల్‌మండిలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కిన అశ్విని, దిగాల్సిన స్టాప్ రావడంతో బోగి డోర్ వద్దకు వెళ్లి నిలబడింది. అదే సమయంలో తన ఫోన్ పడిపోవడంతో తీసుకోబోయి ప్రమాదవశాత్తు జారి రైలు చక్రాల కింద పడిపోయింది. దీంతో ఆమె శరీరం ఛిద్రమైపోయింది. ఘటనా స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News