Andhra Pradesh: అమెరికాలో హెచ్1బీ మోసం.. ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయుల అరెస్ట్!

  • వీసాలు పొందేందుకు తప్పుడు పత్రాల సృష్టి
  • నలుగురు అరెస్ట్.. కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
  • నలుగురికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం

అమెరికాలో ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ నిపుణులకు అమెరికా జారీచేసే హెచ్1బీ వీసాలను త్వరగా పొందడానికి తప్పుడు పత్రాలు సృష్టించడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటరమణ మన్నెం(47), సతీశ్ వేమూరి(52)తో పాటు  విజయ్ మానే(39), ఫెర్నాండో సిల్వ(53)లపై వీసా మోసం అభియోగాల కింద కేసు నమోదు చేశామన్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 2,50,000 డాలర్ల బాండ్ పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు.

వెంకటరమణ, సతీశ్ వేమూరి, విజయ్ మానేలు న్యూజెర్సీ కేంద్రంగా ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇంక్ కంపెనీలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ రెండు కంపెనీలతో పాటు మరో కంపెనీని(క్లయింట్ ఏ) వీరు నిర్వహించేవారన్నారు. అమెరికాకు రావాలనుకునే భారతీయ నిపుణులకు వీరు హెచ్1బీ వీసాలు ఇప్పించేవారనీ, ఇందుకోసం తప్పుడు పత్రాలు సమర్పించారని అన్నారు.

హెచ్1బీ వీసాల జారీప్రక్రియను వేగవంతం చేసేందుకు సదరు భారతీయులు ఇప్పటికే తమ కంపెనీ(క్లయింట్ ఏ)లో పనిచేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ శాఖకు తప్పుడు పత్రాలు సమర్పించారని వెల్లడించారు. వాస్తవానికి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసిన భారతీయులు ఏ కంపెనీలోనూ పనిచేయడం లేదన్నారు. ఒకవేళ ఈ నేరం రుజువు అయితే దోషులకు ఐదేళ్ల జైలుశిక్ష, 2.50 లక్షల జరిమానా విధిస్తారని పేర్కొన్నారు.

More Telugu News