TTD: వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం... వీఐపీ బ్రేక్ విభజన రద్దు!

  • ప్రస్తుతం మూడు లిస్ట్ లుగా దర్శనం
  • ఒకే లిస్ట్ గా మార్చాలని భావిస్తున్న వైవీ
  • ధర్మకర్తల తొలి సమావేశంలోనే నిర్ణయం

ప్రస్తుతం ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించాల్సివుందని గతంలో పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చెప్పిన ఆయన, త్వరలో ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిగా ఏర్పడిన తరువాత తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ విధానం అమలులోకి వస్తే, అన్ని బ్రేక్ దర్శనం టికెట్లకూ సమానంగా స్వామి దర్శనం లభిస్తుంది. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనం టికెట్లను మూడు కేటగిరీల్లో విభజిస్తున్న సంగతి తెలిసిందే. స్థాయిని బట్టి వీటిని మంజూరు చేస్తున్నారు. వీరిలో ఎల్1 టికెట్ ఉంటే, ఒత్తిడి లేకుండా స్వామివారి దర్శనం (అత్యంత ప్రముఖులకు), ఆపై తీర్థం, శఠారీ మర్యాదలు; ఎల్2 టికెట్ ఉంటే, గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు స్వామి వారిని దర్శించుకుంటూ వేగంగా వెళ్లాలి, ఇక ఎల్3 ఉంటే, మరింత వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తూ, దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంతోకాలంగా విమర్శలు వస్తుండటంతోనే విధానాన్ని మార్చాలని వైవీ భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News