icc world cup: పూరన్ సెంచరీ వృథా.. శ్రీలంకదే విజయం!

  • విండీస్‌పై 23 పరుగుల తేడాతో విజయం
  • సెంచరీతో అదరగొట్టిన ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
  • ప్రపంచకప్‌లో విండీస్‌కు ఇది ఆరో ఓటమి

ప్రపంచకప్‌లో భాగంగా చెస్టర్‌లీ స్ట్రీట్‌లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 338 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు మాత్రమే చేసి విజయం ముందు బోల్తా పడింది. నికోలస్ పూరన్ (118) సెంచరీతో చెలరేగినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫాబియన్ అలెన్ 51, గేల్ 35 పరుగులు చేశారు. ఈ ప్రపంచకప్‌లో విండీస్‌కు ఇది ఆరో ఓటమి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక చెలరేగి ఆడింది. అవిష్క ఫెర్నాండో అద్భుత సెంచరీతో అదరగొట్టగా దిముత్ కరుణరత్నె 32, కుశాల్ పెరీరా 64, కుశాల్ మెండిస్ 39, లిహిరు తిరుమన్నె 45(నాటౌట్) పరుగులు చేయడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. సెంచరీ చేసిన అవిష్క ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News