Mahamood Ali: అటవీ శాఖాధికారులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి

  • ముఖ్యమంత్రి పూర్తి సహకారం అందిస్తున్నారు
  • రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశానికే తలమానికం
  • ప్రభుత్వ విధానాలతో నేరాల శాతం తగ్గింది

అటవీ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నేడు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారి అనితపై దాడి ఘటనను ఖండించారు. హరిత హారం కింద మొక్కలు నాటేందుకు వెళ్లినా, అన్యాక్రాంతమైన అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినా అధికారులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని హోంమంత్రి తెలిపారు.

పోలీసులకు ముఖ్యమంత్రి పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు. పోలీస్ హౌసింగ్ సొసైటీ త్వరితగతిన భవనాలను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశానికే తలమానికమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందన్నారు. అంబర్‌పేటలోని మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం, సరూర్‌నగర్‌లో కొత్తగా నిర్మించిన ఎల్బీనగర్‌ సీసీఎస్‌, ఎస్‌వోటీ కార్యాలయం ఐటీ సెల్‌‌ను మహమూద్ అలీ ప్రారంభించారు.

More Telugu News