Uttar Pradesh: ప్రశ్నలతో యూపీ సీఎంను ఇబ్బంది పెడతారని.. జర్నలిస్టులను 2 గంటలు గదిలో బంధించిన కలెక్టర్!

  • యూపీలోని మొరాదాబాద్ లో ఘటన
  • ఆసుపత్రిని సందర్శించిన యోగి ఆదిత్యనాథ్
  • సీఎం వెళ్లాక జర్నలిస్టులను వదిలిన పోలీసులు

విలేకరులు అన్నాక ప్రశ్నలు అడుగుతారు. ఏదైనా సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిలదీస్తారు. రాజకీయ నేతలు ఇందుకు అవసరమైతే సమాధానం చెప్పవచ్చు. లేదంటే ‘నో కామెంట్’ అని అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ అధికారులు మాత్రం కాస్త డిఫరెంట్. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను విలేకరులు కష్టమైన ప్రశ్నలు అడుగుతారని భావించిన మొరాదాబాద్ జిల్లా కలెక్టర్ అందరినీ ఓ గదిలో ఏకంగా 2 గంటలు బంధించారు. చివరికి సీఎం వెళ్లిపోయాక వారిని విడుదల చేశారు. గత నెల 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యూపీలోని మొరాదాబాద్ లో ఓ ఆసుపత్రిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. ఇటీవల కాలంలో యూపీలో మెదడువాపు వ్యాధి లక్షణాలతో చాలామంది పిల్లలు చనిపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు మీడియా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. దీంతో సీఎంను విలేకరులు ప్రశ్నలతో ఇబ్బంది పెడతారని భావించిన జిల్లా కలెక్టర్ రాకేశ్ కుమార్ వీరిని ఓ ఎమర్జెన్సీ రూమ్ లో బంధించాలని పోలీసులను ఆదేశించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో బయటి విలేకరులు లోపలకు రాకుండా అలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో ఆరోపణలను కలెక్టర్ రాకేశ్ కుమార్ ఖండించారు. ఆసుపత్రిలోకి మీడియా సిబ్బంది ఎక్కువగా వచ్చేయడంతో ఎమర్జెన్సీ రూమ్ లో ఉండాల్సిందిగా తాము కోరామని స్పష్టం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు చాలామంది వచ్చారనీ, అప్పటికే గందరగోళం నెలకొనడంతో మీడియాను అనుమతించలేదని చెప్పారు.

More Telugu News