Cricket: బలాబలాలు, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే... వరల్డ్ కప్ సెమీస్ ఇండియా, పాక్ మధ్యే!

  • చివరి దశకు చేరిన పోటీలు
  • సెమీస్ బెర్త్ ఖరారు చేయనున్న నాలుగు మ్యాచ్ లు
  • అందరి కళ్లూ న్యూజిలాండ్ - ఇంగ్లండ్, బంగ్లా - పాక్ మ్యాచ్ లపైనే

బంగ్లాదేశ్ - ఇండియా, శ్రీలంక - ఇండియా, న్యూజిలాండ్ - ఇంగ్లండ్, బంగ్లాదేశ్ - పాకిస్థాన్... వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ లీగ్ దశలో మిగిలున్న ఇతర మ్యాచ్ లను పక్కనబెడితే, సెమీస్ రేసులో నిలిచే జట్లను తేల్చేది ఈ మ్యాచ్ లే. దీంతో ఈ మ్యాచ్ లలో ఎవరు గెలుస్తారన్న విషయమై, సాధ్యాసాధ్యాలను, జట్ల బలాబలాలను క్రికెట్ ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు. ఈ లెక్కల తరువాత సెమీస్ లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంటుందని ఊహాగానాలకు తెరలేపారు. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ.

ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న టీమిండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలతో తన చివరి రెండు మ్యాచ్ లనూ ఆడాల్సివుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉన్న భారత్ కు దాదాపు రెండు మ్యాచ్ లలోనూ విజయం ఖాయమనే చెప్పచ్చు. అదే జరిగితే, టాప్ ప్లేస్ కు వెళుతుంది. (ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే, 16 పాయింట్లతో టాప్ లో ఉంటుంది). ఇక ఇంగ్లండ్ విషయానికి వస్తే, న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే మరే సమీకరణంతో సంబంధం లేకుండా ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది. అయితే, న్యూజిలాండ్ బలం ముందు ఇంగ్లండ్ తేలిపోతుందన్నది అభిమానుల అభిప్రాయం.

ఇక పాక్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తో ఒకే ఒక మ్యాచ్ ఆ జట్టు చేతిలో ఉంది. దీనిలో ఎలాగైనా గెలవడంతో పాటు, న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోతే నాలుగో ప్లేస్ లో సెమీస్ కు చేరుకుంటుంది. ఇప్పుడు పాక్ అభిమానులు కోరుకుంటున్నది ఇదే. అయితే, ఇక్కడ తన పొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్ లతో బంగ్లాదేశ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లలో బంగ్లాదేశ్ గెలిచి, ఇంగ్లండ్ ఓడిపోతే పాకిస్థాన్ స్థానంలో బంగ్లా వచ్చి చేరుతుంది.

పాక్, ఇండియా జట్లతో పోలిస్తే బంగ్లా బలహీనం కాబట్టి, రెండూ గెలవడం కష్టమే. ఇదే సమయంలో న్యూజిలాండ్ ఓటమినీ అంచనా వేయలేం. దీంతో సెమీస్ లో ఇండియా పాకిస్థాన్, ఒకవేళ ఆసీస్ టాప్ లో నిలిస్తే ఆసీస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు రెండో సెమీస్ ఇండియా - న్యూజిలాండ్ లేదా ఆసీస్ - న్యూజిలాండ్ (సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడి, భారత్ తన రెండు మ్యాచ్ లలో గెలిస్తే) మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బంగ్లాదేశ్ సెమీస్ కు వచ్చిందంటే, అప్పటికి ఇండియా, పాక్ లపై గెలిచివుంటుంది కాబట్టి, సెమీస్ లో ఆసీస్ తో పాటు ఇండియా, న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఉంటాయి. ఒకవేళ న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ గెలిస్తే, నెట్ రన్ రేట్ సెమీస్ రేస్ ను తేలుస్తుంది.

ఏదిఏమైనా మరోసారి చిరకాల ప్రత్యర్థులు తలపడితే ఈ వరల్డ్ కప్ పోటీలు మరింత మజాగా ముగుస్తాయని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

More Telugu News