Andhra Pradesh: చంద్రబాబు ప్రజలకు ఇచ్చినంత సొమ్మును ఎవ్వరూ ఇవ్వలేదు.. అనేక పథకాలు తెచ్చారు!: మోత్కుపల్లి

  • కానీ ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను ఓడించారు
  • ఎవరిని గెలిపించాలనుకున్నారో వారినే గెలిపించారు
  • ప్రజల్లో నిలబడితేనే పవన్ కల్యాణ్ గెలుస్తాడు

ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఫెయిల్ అయ్యారని తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో ‘ఇతను కూడా సినిమా నటుడే కదా. ఏం చేయగలడు?’ అనే భావం ప్రజల్లో కలిగిందని వ్యాఖ్యానించారు.

పవన్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే సరిగ్గా ఎన్నికల ముందు వస్తే సరిపోదని అభిప్రాయపడ్డారు. ఈ ఐదేళ్లు ప్రజల్లో నిలబడి, ప్రజా సమస్యల కోసం పోరాడుతూ, రాత్రింబవళ్లు ఉంటే తప్పకుండా పవన్ కల్యాణ్ విజయవంతం అవుతారని జోస్యం చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోత్కుపల్లి మాట్లాడారు.

ఇప్పుడు ఎన్నికల్లో మద్యం, నగదు ప్రవాహం యథేచ్ఛగా సాగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ గా శేషన్ ఉన్నప్పుడు ఈసీ చాలా బాగా పనిచేసిందని గుర్తుచేసుకున్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన సహా అన్ని పార్టీల వాళ్లు డబ్బులు పంచారని మోత్కుపల్లి స్పష్టం చేశారు.

కానీ ప్రజలు ఎవరిని గెలిపించాలని అనుకున్నారో వారినే గెలిపించారని అభిప్రాయపడ్డారు. ‘చంద్రబాబు ప్రజలకు ఇచ్చినంత సొమ్మును ఎవ్వరూ ఇవ్వలేదు. అనేక పథకాలు తీసుకొచ్చారు. ప్రభుత్వ సొమ్మును పెట్టి గెలవాలని అనుకున్నారు. కానీ ప్రజలు తిప్పికొట్టారు’ అని చెప్పారు.

More Telugu News