Andhra Pradesh: విజయవాడలో స్కూలు బస్సు బీభత్సం.. 20 మంది పిల్లలకు గాయాలు!

  • నగరంలోని ఏలూరు రోడ్డులో ఘటన
  • పిల్లలను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • డ్రైవర్ కు మూర్ఛ వచ్చిందంటున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఈరోజు ఓ స్కూలు బస్సు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని విజయవాడ ఏలూరు రోడ్డులో అదుపుతప్పిన ఓ పాఠశాల బస్సు పక్కనే ఆపిన కారుపైకి దూసుకెళ్లింది. అక్కడితో ఆగకుండా ఫుట్ పాత్ పైకి వెళ్లి పక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొట్టి ఆగిపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో 20 మంది పిల్లలు స్కూలుకు వెళుతున్నారు. ఈ ఘటనలో వీరందరికీ స్వల్ప గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. డ్రైవర్ వాహనం నడుపుతుండగా ఆయనకు ఒక్కసారిగా మూర్ఛ వచ్చిందని తెలిపారు. దీంతో సదరు డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News