Tamil Nadu: నాలుగేళ్ల బాలికపై మాజీ సైనికుడి అత్యాచారం, హత్య!

  • తమిళనాడులో ఘటన
  • తల్లిలేని సమయంలో ఇంట్లోకి చొరబడి చిన్నారిపై అఘాయిత్యం
  • అనంతరం హత్య చేసి గోనెసంచిలో కుక్కిన వైనం

అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మాజీ సైనికుడు ఆమెను చంపి మూటగట్టి ఇంట్లో పడేశాడు. తమిళనాడులోని చెన్నై తిరుముల్లైవాయల్‌‌లో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసముండే ఓ మహిళ గురువారం సాయంత్రం తన నాలుగేళ్ల కుమార్తెను ఇంట్లోనే ఉంచి కుమారుడిని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లింది. అయితే, తిరిగి వచ్చిన ఆమెకు కుమార్తె కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికింది. చుట్టుపక్కల వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.

ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చిన ఆమె మరోమారు ఇల్లంతా వెతికింది. ఈ క్రమంలో బాత్రూంలో ఓ గోనె సంచి కనిపించడంతో విప్పి చూసిన ఆమె షాక్‌కు గురైంది. అందులో తన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఆమె బంధువు, మాజీ సైనికోద్యోగి అయిన వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

More Telugu News