SBI: రుణ ఎగవేతదారులకు ఎస్‌బీఐ అల్టిమేటం.. రెండువారాల్లో చెల్లించాలని ఆదేశం

  • పది మంది ఎగవేతదారుల పేర్లను బయటపెట్టిన ఎస్‌బీఐ
  • రూ.1500 కోట్ల వరకు ఉద్దేశపూర్వకంగా ఎగవేత
  • స్పాన్కో లిమిటెడ్‌ సంస్థ రూ.347 కోట్ల బకాయిలు

రుణ ఎగవేతదారులపై భారతీయ స్టేట్ బ్యాంకు కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. వివిధ రంగాలకు చెందిన పదిమంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పేర్లను బయట పెట్టిన ఎస్‌బీఐ తక్షణమే వడ్డీతో సహా రుణాలు చెల్లించాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు వారాల సమయమిచ్చిన బ్యాంకు.. ఆలోపు కట్టకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఎస్‌బీఐ వెల్లడించిన ఎగవేతదార్లలో ఫార్మా, వజ్రాల వ్యాపారం, విద్యుత్ రంగాలకు చెందిన వారు ఉన్నారు. వీరి నుంచి రూ.1500 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ముంబైకి చెందిన స్పాన్కో లిమిటెడ్‌ నుంచి రూ.347 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉండగా, అంధేరీ ఈస్ట్‌ ప్రాంతంలోని కాలిక్స్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ నుంచి రూ. 327 కోట్లు రావాల్సి ఉన్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. జాబితాలో అతి పెద్ద ఎగవేతదారులు వీరే. ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో చేర్చిన ఎస్‌బీఐ ఈ అల్టిమేటం జారీ చేసింది.    

More Telugu News