Kesavan: కులాంతర వివాహం చేసుకుందని పచ్చి బాలింతను కడతేర్చిన కన్నతండ్రి

  • ప్రేమ వివాహం చేసుకున్న కేశవన్, హేమ
  • వారం క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన హేమ
  • ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా అడ్డుకున్న తండ్రి, సోదరులు
  • మామిడి తోటలోకి తీసుకెళ్లి హేమ హత్య

కులాంతర వివాహం చేసుకుందనే కోపం రెండున్నరేళ్లకు కూడా తండ్రిలో చల్లారలేదు. దీంతో పచ్చి బాలింత అని కూడా చూడకుండా కన్న కూతురిని తండ్రే కడతేర్చిన దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసరపెంటలో చోటు చేసుకుంది. ఊసరపెంట గ్రామానికి చెందిన భాస్కర్‌నాయుడు, వరలక్ష్మి దంపతుల కూతురు హేమవతి(23), అదే గ్రామానికి చెందిన గోవిందయ్య, శోకమ్మ దంపతుల కుమారుడు కేశవన్ ఇద్దరూ రెండున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు భయపడి హేమ, కేశవన్‌లు రెండేళ్లకు పైగా వేరే ప్రాంతంలో జీవించారు. ఏడు రోజుల క్రితం హేమ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దంపతులిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చారు.

నేడు శిశువు అనారోగ్యానికి గురవడంతో పలమనేరులోని ఆసుపత్రికి కేశవన్ దంపతులు తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా ఊసరపెంట గ్రామ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద యువతి తండ్రి, సోదరులు వారిపై దాడి చేశారు. హేమను ద్విచక్ర వాహనంపై సమీప మామిడి తోటలోకి తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని బావిలో పడేశారు. స్థానికులు చూసి కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. దీంతో కేశవన్ కుటుంబ సభ్యులు హేమ కుటుంబంపై దాడికి పాల్పడటంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ యుగంధరబాబు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More Telugu News