Andhra Pradesh: విజయవాడలో పేదలకు ఇళ్లు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  • అర్హులైన పేదలందరికీ ఇళ్లు పంపిణీ చేస్తాం
  • విజయవాడకు 55,800 ఇళ్లు కేటాయించారు
  • నవంబర్ నాటికి దాదాపు 6,576 ఇళ్లు పూర్తి చేస్తాం

 విజయవాడ నగరంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. నవంబర్ నాటికి దాదాపు 6,576 ఇళ్లు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం సచివాలయంలోని తన ఛాంబర్ లో పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్లు పంపిణీ చెయ్యాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.

ఇప్పటి వరకూ విజయవాడకు కేటాయించిన 55,800 ఇళ్లకు గాను నవంబర్ నాటికి జక్కంపూడి లో 6,576 ఇళ్లకు గ్రౌండ్ లెవెల్ పూర్తి చేస్తామని, ఇప్పటికే 3,840 ఇళ్లకు స్లాబ్ వర్క్ పూర్తి చేసినట్టు చెప్పారు. మిగిలిన ఇళ్లు పూర్తి చేసేందుకు 430 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని, అందుకుగాను సూరంపల్లిలో 180 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో తిలోచనపురంలో 360 ఎకరాలు, ములపాడు నందు 48 ఎకరాలు సేకరించేందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులతో మరో సమావేశం నిర్వహించి నిర్ణయం తెలుపుతామని అన్నారు.

More Telugu News