Akbaruddin Owaisi: చికిత్స అనంతరం లండన్ నుంచి తిరిగొచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీకి ఘనస్వాగతం

  • ఉత్సాహంగా కనిపించిన అక్బరుద్దీన్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చిన ఎంఐఎం శ్రేణులు
  • గతంలో అక్బర్ పై హత్యాయత్నం

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్వస్థలానికి చేరుకున్నారు. లండన్ లో చికిత్స అనంతరం అక్బర్ ఇవాళ హైదరాబాద్ తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఎంఐఎం వర్గాలు పెద్దఎత్తున స్వాగతం పలికాయి. అక్బరుద్దీన్ వస్తున్నాడని తెలియడంతో పార్టీ శ్రేణులు విమానాశ్రయ పరిసరాలకు భారీగా చేరుకున్నాయి. ఇక, విమానాశ్రయంలో అక్బరుద్దీన్ ఒవైసీ ఎంతో హుషారుగా కనిపించారు. అనారోగ్యం ఛాయలేవీ లేకుండా ఉత్సాహంగా, వడివడిగా నడుస్తూ విమానాశ్రయం వెలుపలికి వచ్చారు. తన వాహనంలో నేరుగా నివాసానికి తరలివెళ్లారు.

తమ నేత ఆరోగ్యం సంతరించుకుని తిరిగిరావడంతో ఎంఐఎం శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల కిందట అక్బరుద్దీన్ పై హైదరాబాద్ లో హత్యాయత్నం జరిగింది. తీవ్రగాయాలపాలైన అక్బరుద్దీన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు కానీ, గాయాలు తీవ్రమైనవి కావడంతో ఆ తర్వాత కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తరచుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో లండన్ లో మెరుగైన చికిత్స కోసం వెళ్లారు.

More Telugu News