Chandrababu: చంద్రబాబు ఇంటిని కూలదోస్తారట..ప్రజలంతా అప్రమత్తం కావాలి: అచ్చెన్నాయుడు పిలుపు

  • చంద్రబాబు నివాసానికి అన్ని పర్మిషన్లూ ఉన్నాయి
  • అప్పుడే అన్ని విషయాలను పరిశీలించాం
  • అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే తగదు

ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిని కూలదోస్తారట, ప్రజలందరూ ఆలోచించాలని, ప్రజలంతా అప్రమత్తం కావాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. చంద్రబాబు ఇంటిని కూలగొడతామని సీఆర్డీఏ నోటీసులు అంటించడంపై ఆయన మండిపడ్డారు. ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై గోబెల్స్ ప్రచారం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. అక్రమనిర్మాణంలో చంద్రబాబు నివాసం ఉంటున్నారంటూ  ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

సీఎం జగన్ కు అనుభవం లేదని, ముఖ్యమంత్రిని అయ్యానని, తన చేతిలో అధికారం ఉందని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పప్పులో కాలేసినట్టు అవుతుందని అన్నారు. కనీసం, వైసీపీలో ఉన్న సీనియర్ల నుంచి లేదా అనుభవజ్ఞులైన వారి నుంచి సలహాలు తీసుకుని పరిపాలిస్తే ఈ సమస్యలు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడుని, వారి కుటుంబాన్ని అవహేళన చేయాలని, రోడ్డు మీద పడేయాలని కక్షపూరితంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని, పైగా తప్పును తమపై వేస్తున్నారని దుయ్యబట్టారు.

కనీస ఇంగితజ్ఞానం, రాజకీయ అనుభవం ఉన్నవాళ్లమని, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు అటువంటి తప్పులు చేయరని అన్నారు. చంద్రబాబు నివాసం ఉన్న భవనాన్ని అద్దెకు తీసుకున్న రోజునే అన్ని విషయాలను పరిశీలించామని, పర్మిషన్లు అన్నీ ఉన్నాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

More Telugu News