Andhra Pradesh: వైసీపీ నేత అనిల్ కుమార్ రెడ్డిపై హత్యాయత్నం.. జేసీ వర్గీయులే చేశారంటున్న అనంతపురం నేత!

  • ఈరోజు అనంతపురం జిల్లాలో ఘటన
  • దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న వైసీపీ నేత
  • జేసీ వర్గీయులపై ఫిర్యాదు చేసిన అనిల్ కుమార్ రెడ్డి

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత అనిల్ కుమార్ రెడ్డిపై ఈరోజు హత్యాయత్నం జరిగింది. అనిల్ కుమార్ ఈరోజు జిల్లా కేంద్రానికి బయలుదేరగా, తాళ్లపొద్దుటూరు నుంచి వీరాపురం వరకూ కొందరు దుండగులు అనిల్ ను కారులో వెంబడించారు. ఈ క్రమంలో అనిల్ వెళుతున్న కారును తమ వాహనాలతో ఢీకొట్టించారు. అనంతరం వేట కొడవళ్లతో నరికి చంపేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్న అనిల్ కారులో హుటాహుటిన సమీపంలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు 10 మంది, వీరాపురం టీడీపీ నేత చింతా నాగేశ్వరరెడ్డి తనపై దాడి చేశారని అనిల్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కారును వెంబడించిన టీడీపీ నేతలు తమ వాహనంతో ఢీకొట్టారని ఆరోపించారు. అనంతరం వేటకొడవళ్లతో దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అదృష్టంకొద్దీ తాను ఈ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.

More Telugu News