Andhra Pradesh: నారా లోకేశ్ పై మండిపడ్డ ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత!

  • హత్యలపై లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారు
  • కుటుంబ కలహాలతో చనిపోయినా మాకు ఆపాదిస్తున్నారు
  • కరకట్ట కూల్చివేతలపై మీ రాద్ధాంతం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయనీ, పలువురిని హత్య చేశారని ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని నారా లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ కలహాలతో మంగళగిరిలో ఓ హత్య జరిగితే దాన్ని కూడా వైసీపీకి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు మీడియాతో హోంమంత్రి సుచరిత మాట్లాడారు.

నారా లోకేశ్, టీడీపీ నేతలు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతున్నారని హోంమంత్రి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలే వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక టీడీపీ శ్రేణులు ఇప్పటివరకూ 57 మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని విమర్శించారు. కరకట్ట దగ్గర అక్రమ నిర్మాణాలు తొలగిస్తుంటే  నారా లోకేశ్, టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.

More Telugu News