Maharashtra: ‘జై శ్రీరామ్ చెప్పరా’.. అంటూ ముస్లిం యువకుడిపై అల్లరిమూక దాడి.. దోపిడీ!

  • మహారాష్ట్రలోని థానేలో ఘటన
  • స్పృహ కోల్పోయేలా కొట్టిన ముగ్గురు దుండగులు
  • చనిపోయాడనుకుని కారులో పడేసి పరారీ

మనుషులు మృగాల్లా మారిపోతున్నారు. సొంత దేశస్తులనే మతం పేరుతో చావగొడుతున్నారు. ఇటీవల జార్ఖండ్ లో తబ్రేజ్ అన్సారీ అనే ముస్లిం యువకుడిని కొట్టి చంపిన ఘటనను మర్చిపోకముందే అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. క్యాబ్ నడుపుకుంటున్న ఫైజల్ ఉస్మాన్(25) అనే యువకుడిని చుట్టుముట్టిన కొందరు దుండగులు జైశ్రీరామ్ అని చెప్పాలంటూ చావబాదారు. చివరికి ఉస్మాన్ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడు అనుకుని పారిపోయారు. థానేలో గత ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పైజల్ ఉస్మాన్ గత ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ రావడంతో ప్రయాణికుడిని ఎక్కించుకుని బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో అతని వాహనం మొరాయించింది. ఈ సందర్భంగా పార్కింగ్ లైట్స్ ఆన్ చేసిన ఉస్మాన్ బండిని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే బైక్ పై ముంగేశ్ ముండే(30), అనిల్ సూర్యవంశి(22) జయదీప్ ముండే(26) అటుగా వచ్చారు. ముస్లిం మతస్తుడైన ఉస్మాన్ ను చూస్తూనే గొడవ పెట్టుకున్నారు. కారు నుంచి బయటకు లాగిపడేసి కొట్టడం మొదలుపెట్టారు.

‘నన్ను కొట్టవద్దు. దయచేసి ఆ అల్లాహ్ కోసమైనా నన్ను వదిలిపెట్టండి’ అని బాధితుడు వేడుకున్నాడు. అయినా కనికరించని ఈ దుండగులు ‘జై శ్రీరామ్ అని చెప్పు’ అంటూ అతడిని విచక్షణారహితంగా చావబాదారు. ఈ దెబ్బలకు తాళలేక ఉస్మాన్ స్పృహ కోల్పోగా, కారులోని ప్రయాణికుడు ప్రాణభయంతో పారిపోయాడు. చివరికి ఉస్మాన్ చనిపోయాడని భావించిన దుండగులు, అతడిని కారులో కూర్చోబెట్టారు. అనంతరం ఫోన్, పర్సు తీసుకుని పరారయ్యారు. కొద్దిసేపటికి మెలకువలోకి వచ్చిన ఉస్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్ కు తరలించారు.

More Telugu News