Haryana: పెళ్లయిన మర్నాడే పరారైన వధువు.. ఎక్కడుందో తెలిసి బంధువుల షాక్!

  • ఇంట్లోంచి పారిపోయిన 23 రోజుల తర్వాత నవ వధువు ఆచూకీ లభ్యం
  • హరియాణాలో స్నేహితురాలితో సహజీవనం
  • ఏం చేయలేమంటూ చేతులెత్తేసిన పోలీసులు

పెళ్లయిన తెల్లారే ఇంట్లోంచి పారిపోయిన ఓ నవవధువు 23 రోజుల తర్వాత పొరుగు రాష్ట్రంలో మరో యువతితో   సహజీవనం చేస్తూ కనిపించడంతో పోలీసులు, బంధువులు షాకయ్యారు. రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన యువతికి షాజహాన్‌పూర్‌కు చెందిన యువకుడితో మూడు వారాల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లైన మరుసటి రోజే కొత్త పెళ్లికూతురు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.

ఆమె కోసం గాలించి, విసిగి వేసారిన బంధువులు ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం యూపీ, రాజస్థాన్‌లలో గాలింపు మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే, అనూహ్యంగా రెండు రోజుల క్రితం ఆమె జాడ లభ్యమైంది. హరియాణాలోని మనేసర్‌లో ఆమె వున్నట్టు పోలీసులు గుర్తించారు. బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు.  

 అక్కడామె నేషనల్ చాంపియన్ అయిన మరో యువతితో కలిసి సహజీవనం చేస్తోంది. నాలుగేళ్లుగా తమ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కొత్త పెళ్లికూతురు పోలీసులకు తెలిపింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. తామిద్దరం మేజర్లమని, తాము ఎలా ఉండాలో, ఎవరితో ఉండాలో తమకు తెలుసని వాదించారు. నవ వధువు మాట్లాడుతూ తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేశారని, అందుకే పారిపోయి వచ్చానని తెలిపింది. దీంతో చేసేది ఏమీలేక కోర్టు ఆదేశాలతో పోలీసులు ఇద్దరినీ విడిచిపెట్టారు.

More Telugu News