Ashok babu: సీఎం అవ్వాలంటే జైలుకు వెళ్లి వచ్చిన క్వాలిఫికేషన్ ఉండాల్సిందే!: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు

  • చంద్రబాబుపై ఏదో విధంగా అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారు
  • ప్రభుత్వ నిర్ణయాల్లో అధికారుల పాత్ర కూడా చాలా ఉంటుంది
  • రాజశేఖరరెడ్డి కూడా కమిటీలు వేసి ఏం చేయలేకపోయారు

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలంటే జైలుకు వెళ్లి వచ్చిన క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనని ప్రజలు నిరూపించారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి 30 అంశాలపై విచారణ చేయాలన్న జగన్ నిర్ణయంపై ఓ టీవీ చానల్ నిర్వహించిన డిబేట్‌లో అశోక్ బాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుపై ఏదో రకంగా అవినీతి ముద్ర వేసి జైలుకు పంపాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అధికారుల పాత్రే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్న అశోక్ బాబు.. మరి వారిని కూడా జైలుకు పంపుతారా? అని ప్రశ్నించారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి కూడా కమిటీలు వేశారని, కానీ చంద్రబాబును ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు. ఒకవేళ పలానా అంశంలో అవినీతి జరిగిందని భావిస్తే జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సవాలు చేశారు. అంతేతప్ప ఏదో రకంగా అవినీతి ముద్ర వేయాలనుకోవడం సరికాదని అశోక్ బాబు పేర్కొన్నారు.

More Telugu News