Haryana: హరియాణా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వివేక్‌ చౌదరి హత్య

  • జిమ్‌ వద్ద కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తి
  • వ్యాయామం పూర్తి చేసి కారు వద్దకు వెళ్తుండగా కాల్పులు
  • ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి

జిమ్‌కు వెళ్లి వ్యాయామం పూర్తి చేసుకుని బయటకు వస్తున్న హరియాణా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వివేక్‌ చౌదరిని ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి కాల్చిచంపాడు. ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. జిమ్‌ పార్కింగ్‌ స్థలంలో ఉన్న కారు వద్దకు వెళ్తున్న ఆయనపై సమీపం నుంచి దుండగుడు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయిన వివేక్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు.

కాగా ఘటనపై హరియాణా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అశోక్‌ తన్వీర్‌ స్పందిస్తూ రాష్ట్రంలో అటవిక పాలన నడుస్తోందనేందుకు ఈ సంఘటన ఉదాహరణ అన్నారు. ‘తమపై తిరగ బడిందని ఓ యువతిని నిన్న దుండగులు కాల్చిచంపారు, ఇప్పుడు ఏకంగా పార్టీ నేతనే హతమార్చారు. ఇదేం పాలన?’ అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణం ఈ సంఘటనలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

More Telugu News