Nara Lokesh: మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు... చిట్టావిప్పిన నారా లోకేశ్!

  • సభా సంఘాలు ఉపసంఘాలు వేశారు
  • ఒక్క కమిటీ కూడా అవినీతిని తేల్చలేదు
  • ట్విట్టర్ లో నారా లోకేశ్

వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన తండ్రి చంద్రబాబుపై 26 కమిటీలను వేశారని, వాటిల్లో ఒక్క కమిటీ కూడా ఇసుమంత అవినీతిని చూపించలేదని, ప్రతి కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిందని మాజీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై వేసిన కమిటీల వివరాల చిట్టాను బయటపెట్టారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. "అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌!" అని అన్నారు. అంతకుముందు "మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది" అని, ఆపై "పోల‌వ‌రంపై టీడీపీ హ‌యాంలో పంపిన అంచ‌నాల‌న్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల...కల గానే మిగిలిపోతుంది" అని విమర్శలు గుప్పించారు.

More Telugu News