Andhra Pradesh: చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ.. డుమ్మా కొట్టిన కాపు నేతలు!

  • ఈరోజు ఉండవల్లిలో పార్టీ నేతలతో బాబు భేటీ
  • తన నివాసం కూల్చివేస్తే ఏం చేయాలన్న దానిపై చర్చ
  • కళా వెంకట్రావు తప్ప కాపు నేతలంతా గైర్హాజరు

ఉండవల్లిలోని ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజావేదిక కూల్చివేతపై చర్చించారు. ఒకవేళ తాను ఉంటున్న భవనం కూల్చివేతకు ప్రభుత్వం ఉపక్రమిస్తే ఏం చేయాలన్న విషయమై నేతలతో చర్చించారు. ఈ భేటీకి కళా వెంకట్రావు, దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, కాల్వ శ్రీనివాసులు తదితరులు హాజరు కాగా, టీడీపీ కాపు నేతలు పలువురు గైర్హాజరు అయ్యారు.

ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాపు నేతలు కాకినాడలోని ఓ హోటల్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు జరిగిన భేటీకి బోండా ఉమ, వేదవ్యాస్, జ్యోతుల నెహ్రూ, పంచకర్ల రమేశ్ తదితరులు డుమ్మా కొట్టారు. బోండా ఉమ అయితే  విజయవాడలో ఉండికూడా ఈ సమావేశానికి రాలేదు. ఈ నేపథ్యంలో కాపు నేతలంతా మూకుమ్మడిగా పార్టీని వీడి బీజేపీలో చేరుతారన్న వాదనలు ఊపందుకుంటున్నాయి.

More Telugu News