ms dhoni: అది 'ఎంఎస్ ధోనీ హోటల్'.. అభిమానులు బిల్లు కట్టక్కర్లేదు!

  • తన హోటల్ కు ఎంఎస్ ధోనీ పేరు పెట్టుకున్న వీరాభిమాని
  • ధోనీ అభిమానులకు ఫ్రీ ఫుడ్
  • ధోనీని కలుస్తాననే నమ్మకముందన్న బోస్

భారత క్రికెట్ దిగ్గజం ధోనీకి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తమ అభిమాన ఆటగాడిపై ఒక్క కామెంట్ చేసినా ఆయన ఫ్యాన్స్ సహించరు. చివరకు సచిన్ వంటి దిగ్గజాన్ని కూడా ట్రోల్ చేయడానికి ధోనీ వీరాభిమానులు వెనుకాడరు. ప్రపంచకప్ లో జరిగిన ఒక మ్యాచ్ లో ధోనీ చాలా నెమ్మదిగా ఆడాడంటూ కామెంట్ చేసిన సచిన్... ధోనీ అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

తాజాగా, ధోనీపై తనకు ఎంతటి అభిమానముందో మరో అభిమాని నిరూపించాడు. పశ్చిమబెంగాల్ అలిపుర్దువార్ జిల్లాకు చెందిన శంభూ బోస్ అనే వ్యక్తి ధోనీకి వీరాభిమాని. అందుకే తన హోటల్ కు ఎంఎస్ ధోనీ పేరు పెట్టుకున్నాడు. అంతేకాదు, ధోనీ అభిమానులు ఎవరైనా అక్కడ భోజనం చేసినా, టీ లేదా కాఫీ తాగినా వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు.

ధోనీ వ్యక్తిత్వం, ఆటతీరు తనకు ఎంతో ఇష్టమని బోస్ తెలిపాడు. ధోనీ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఒకవేళ ధోనీని కలిసే అవకాశం తనకు వస్తే... తన హోటల్ కు రమ్మని ధోనీని ఆహ్వానిస్తానని తెలిపాడు. ధోనీకి అన్నం, చేపల కూర అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఏదో ఒక రోజు ధోనీని కలుస్తాననే నమ్మకం తనకుందని... అప్పుడు తన హోటల్ కు ఆహ్వానించి చేపల కూర రుచి చూపిస్తానని అన్నాడు.

More Telugu News