Telangana: భారీగా పెరిగిన తెలంగాణ అప్పులు.. మార్చి నాటికి 159 శాతం పెరుగుదల!

  • తెలంగాణ అప్పులపై రాజ్యసభలో నిర్మల సమాధానం
  • రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 69,517 కోట్ల రుణాలు
  • ఈ ఏడాది మార్చి నాటికి 159 శాతం పెరిగి రూ. 1,80,239 కోట్లకు చేరిక

ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పులు 159 శాతం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఎంఏ ఖాన్ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంపై రూ. 69,517 కోట్ల అప్పులు ఉండగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి అవి 159 శాతం పెరిగి రూ. 1,80,239 కోట్లకు చేరినట్టు నిర్మల తెలిపారు. ఉదయ్ పథకం కింద 2016-17లో రూ. 8923 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి తెలంగాణకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు.

మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం.. 2014-15లో తెలంగాణ అప్పులు రూ.79,880 కోట్లు కాగా, చెల్లించిన వడ్డీ రూ.5,593 కోట్లు, 2015-16లో అప్పులు రూ.97,992 కోట్లు కాగా, చెల్లించిన వడ్డీ రూ.7,942 కోట్లు, 2016-17లో అప్పులు రూ.1,34,738 కోట్లు కాగా, చెల్లించిన వడ్డీ రూ. 8,609 కోట్లు, 2017-18లో అప్పులు రూ.1,51,133 కోట్లు కాగా, చెల్లించిన వడ్డీ రూ.11,139 కోట్లు, 2018-19లో తెలంగాణ ప్రభుత్వం అప్పులు రూ.1,80,239 కోట్లు కాగా, చెల్లించిన వడ్డీ 11,691 కోట్లుగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

More Telugu News