Hyderabad: మస్కట్ పంపిస్తానని నమ్మించి.. మహిళపై అత్యాచారం చేసిన నిందితుడికి అరదండాలు!

  • వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన నిందితుడు
  • నిరుద్యోగులను విదేశాలకు పంపే ఏజెంట్‌‌గా ప్రచారం
  • నమ్మి ఆశ్రయించిన మహిళపై పలుమార్లు అత్యాచారం

మస్కట్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం..  పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన కోలి వెంకట నర్సింహమూర్తి (41) ఎలక్ట్రీషియన్‌. తనను తాను ఏజెంట్‌గా అందరితోనూ పరిచయం పెంచుకున్నాడు. ఉద్యోగం కోసం మస్కట్, దుబాయ్ వంటి ప్రాంతాలకు నిరుద్యోగులను పంపిస్తుంటానని ప్రచారం చేసుకున్నాడు.

ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే అయిన అదే జిల్లాకు చెందిన ఓ మహిళ (35) అతడిని ఆశ్రయించింది. మస్కట్ పంపిస్తానని ఆమెను నమ్మబలికిన మూర్తి ఈ నెల 18న బాధిత మహిళతోపాటు మరో మహిళను తీసుకుని చెన్నై వెళ్లాడు. అయితే, టికెట్ దొరకలేదంటూ ఆమెతో పాటు వచ్చిన మరో మహిళను వెనక్కి పంపిన నిందితుడు.. బాధిత మహిళతో కలిసి ఓ లాడ్జీలో దిగాడు. ఆక్కడ ఆమెపై రెండు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకపోవడంతో ఇప్పుడు వెళ్లడం కుదరదని, మరోమారు వెళ్దామంటూ 22న ఇద్దరూ కలిసి రైలులో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ లాడ్జీలో దిగారు. విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించిన మూర్తి మరోమారు ఆమెపై అత్యాచారానికి యత్నించగా ఆమె బాత్రూంలోకి దూరి గడియ వేసుకుంది. అతడు వెళ్లే వరకు అందులోనే ఉంది. ఆ తర్వాత లాడ్జీ సిబ్బంది సహాయంతో బయటపడి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు.

More Telugu News