Chamakura Malllareddy: అనాథ యువతికి అన్నీతానై వివాహం జరిపించిన మంత్రి మల్లారెడ్డి

  • యువతికి విజయవాడ యువకుడితో పెళ్లి
  • రూ.2.35 లక్షలు అమ్మాయి పేర డిపాజిట్ చేసిన మల్లారెడ్డి 
  • ఖర్చుల కోసం మరో పాతికవేలు ఇచ్చిన వైనం

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి ఓ మంచిపని చేసి అందరి అభినందనలు అందుకున్నారు. ఓ అనాథ యువతికి మల్లారెడ్డి దంపతులు తల్లిదండ్రుల్లా మారి వివాహ శుభకార్యం జరిపించారు. బహుదూర్ పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పుష్ప అనే అమ్మాయి ఆశ్రయం పొందింది. ఆశ్రమంలోనే పుష్ప విద్యాబుద్ధులు నేర్చుకుంది. యుక్తవయస్సు రావడంతో ఆమెను విజయవాడకు చెందిన కిశోర్ అనే యువకుడికిచ్చి పెళ్లి చేశారు.

ఈ పెళ్లికి మంత్రి మల్లారెడ్డి దంపతులు పెద్దమనసుతో ముందుకువచ్చి పుష్పకు తల్లిదండ్రుల స్థానంలో నిలిచి సమస్త లాంఛనాలు జరిపించారు. పుష్ప పేరుమీద రూ.2.35 లక్షలకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను కానుకగా అందించారు. 'ఖర్చులకు ఉంచుకోండి' అంటూ మరో పాతికవేల రూపాయలు ఇచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తమ పెళ్లి జరగడానికి కారణమైన మంత్రి మల్లారెడ్డి దంపతులకు పుష్ప కృతజ్ఞతలు తెలుపుకుంది.

More Telugu News