Phone Calls: ఫోన్ కాల్స్‌తో విసిగిస్తున్నారు.. బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు: పోలీసులకు మిర్చిబాబా ఫిర్యాదు

  • డిగ్గీరాజా విజయాన్ని కాంక్షిస్తూ హోమం
  • ఓడితే సజీవ సమాధి అవుతానని ప్రకటన
  • సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్

తనను ఫోన్‌ కాల్స్‌తో విసిగిస్తున్నారని, ఇప్పటి వరకూ 3 వేల కాల్స్ వచ్చాయని, వాటిలో బెదిరింపు కాల్స్ కూడా ఉన్నాయని పేర్కొంటూ స్వామి వైరాగ్యానంద అలియాస్ మిర్చిబాబా పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ హోమం చేశారు. అంతే కాకుండా ఒకవేళ ఎన్నికల్లో డిగ్గీరాజా ఓడిపోతే తాను సజీవ సమాధి అవుతానని ప్రకటించారు.

అయితే ఎన్నికల్లో డిగ్గీరాజా ఓడిపోయారు. దీంతో మిర్చిబాబా గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో తనను తాను సజీవ సమాధి చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఆయన జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. అందుకు కలెక్టర్ అనుమతి నిరాకరించారు. దీంతో కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వచ్చిన మిర్చిబాబా తాజాగా తనకు ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News