janasena: పార్టీ శ్రేణులతో నేటి నుంచి జనసేనాని సమావేశాలు : జంప్‌ జిలానీలపైనే దృష్టి?

  • గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యాచరణ
  • సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాజయం
  • అనంతరం పార్టీని వీడిన పలువురు పార్టీ నేతలు

జనసేన అంతర్గత సమీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం, జంప్‌ జిలానీలను బుజ్జగించడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. కేవలం ఆ పార్టీకి ఒకే ఒక్క సీటు లభించగా, పార్టీ అధినేత పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో రిజల్ట్స్‌ వచ్చిన వెంటనే పలువురు పార్టీ నేతలు పార్టీకి రాంరాం చెప్పేశారు. మరికొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపి త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల కోసం గ్రామ స్థాయి నుంచి పార్టీని సమాయత్తం  చేసేందుకు పార్టీ నేతలతో అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్  ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఏం చేయాలన్నదానిపై కేడర్‌తో చర్చించడం, అదే సమయంలో జంపింగ్‌ ఆలోచన ఉన్న నేతలను బుజ్జగించడం ప్రధాన ఎజెండాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2024 నాటికి పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశలు కేడర్‌లో రేకెత్తించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

More Telugu News