Andhra Pradesh: వైవీ సుబ్బారెడ్డి తులాభారానికి హెరిటేజ్ నెయ్యి.. సోషల్ మీడియాలో కామెంట్లు!

  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు
  • ఇప్పుడు అదే నెయ్యితో తులాభారం
  • నాణ్యత వల్లే దానిని ఉపయోగిస్తున్నారన్న టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు లెక్కేలేదు. అలాంటిది ఆ సంస్థకు చెందిన నెయ్యిని టీటీడీ చైర్మన్‌గా ఎన్నికైన వైసీపీ నేతల వైవీ సుబ్బారెడ్డి తులాభారంలో ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుబ్బారెడ్డి శనివారం కాలిన నడకన తిరుమల చేరుకుని వేంకటేశుని దర్శించుకున్నారు. అనంతరం గరుడ ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తులాభారం ఫొటోను ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  

ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డికి తులాభారం వేశారు. అయితే, తులాభారం కోసం త్రాసులోని మరోవైపు హెరిటేజ్ నెయ్యిని వాడారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసినవారు ఇప్పుడు అదే సంస్థ నెయ్యి వాడడం ఏమిటని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తుండగా, హెరిటేజ్ అనుసరిస్తున్న నాణ్యతా విధానాల వల్లే టీటీడీ ఇంకా దానిని వినియోగిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

More Telugu News